న్యూస్ డెస్క్ : దౌల్తాబాద్ మండలంలోని షేర్పల్లి గ్రామంలో హృదయాన్ని తాకే సంఘటన చోటుచేసుకుంది. తండ్రి, అన్నను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి, ఆ కుటుంబానికి చెందిన జక్కుల శ్యామల కుమార్తె రితిక వివాహాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకకు దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు మాట్లాడుతూ, కీర్తిశేషులు జక్కుల స్వామి పార్టీకి ఎన్నో సంవత్సరాల పాటు నిబద్ధతతో సేవలు అందించారని గుర్తు చేశారు.
రెండు సంవత్సరాల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి మరణించగా, ఏడాది క్రితం ఆయన కుమారుడు కూడా మరణించడం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో వివాహం నిర్వహించడం కష్టసాధ్యమైందని చెప్పారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు వచ్చి రితిక వివాహానికి రూ.25,000 నగదు సహాయం మరియు పుస్తె మట్టెలను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సహాయం కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల ప్రధాన కార్యదర్శి జనగామ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నారెడ్డి సంపత్ రెడ్డి, రమేష్, ఉపసర్పంచ్ ఆది బాలకృష్ణ, బందరం ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
