• పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, రామచంద్రం
సిద్దిపేట న్యూస్, జూన్ 17: తెలంగాణలోని పద్మశాలి సమాజానికి చెందిన చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి పరిరక్షణ మరియు చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, రామచంద్రం డిమాండ్ చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యయన కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేత పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని, వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు మరియు సంక్షేమ పథకాలలో అవసరమైన వస్త్రాల కొనుగోలుకు చేనేత ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలలో పంపిణీ చేసే వస్త్రాలు, యూనిఫాంలు, ఇతర బట్టల కొనుగోళ్లను చేనేత సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తే కార్మికులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. చేనేత రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే చేనేత కార్మికులకు ముడిసరుకు సబ్సిడీ, మార్కెటింగ్ సదుపాయాలు, రుణాలపై వడ్డీ రాయితీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ప్రత్యేక మార్కెటింగ్ విధానాలు అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి పద్మశాలి సంఘ నాయకులు, చేనేత కార్మిక ప్రతినిధులు, వివిధ జిల్లాల అధ్యయన కమిటీ సభ్యులు పాల్గొని చేనేత రంగ సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
