• అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య
తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: వరంగల్ ప్రజల ఆరాధ్యదైవం, కాకతీయుల ఇలవేల్పు అయిన శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
15 రోజుల పాటు నిర్వహించనున్న మహోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి చేరుకున్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారికి దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అయ్యగారు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం మీడియాతో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో వరంగల్ జిల్లా దశాబ్దాల కలలుగా ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు సాకారమవుతున్నాయని పేర్కొన్నారు. మామునూరు విమానాశ్రయం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని, వాటికి సంబంధించిన ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
వరంగల్ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో టెంపుల్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకలైన చారిత్రక కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ సంపదను ప్రపంచానికి మరింత చేరువ చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పర్యాటకుల రాక పెరగడం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
భద్రకాళి దేవాలయం పరిసరాల్లో మాడవీధుల అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చిత్తశుద్ధితో కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యేక దృష్టితో వరంగల్ మహానగరం సమగ్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.
భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల ఆలయం, చిల్పూర్ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను కేంద్ర ప్రభుత్వ పర్యాటక, ప్రసాద్ పథకాల పరిధిలోకి తీసుకువచ్చి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ఈ దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటక రంగ విస్తరణ కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
