• ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు వేం నరేందర్ రెడ్డి
• సహనం, చిరునవ్వుతో ముందుకు సాగే నాయకుడు వేం నరేందర్ రెడ్డి
• ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ విస్మరిస్తోంది..
• ప్రశ్నించే యువత అకౌంట్ల బ్లాక్‌ చేయడం బీజేపీ అసహన రాజకీయాలకు నిదర్శనం
• దేశంలో జరుగుతున్న అన్యాయాలను రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు
• ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది
• రాష్ట్ర అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి రాకెట్ అయితే.. వేం నరేందర్ రెడ్డి నిప్పురవ్వ

న్యూస్ డెస్క్ : రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి సన్మానోత్సవ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్‌కు విచ్చేసిన వేం నరేందర్ రెడ్డికి ఎంపీ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

అనంతరం సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వెంటనే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను నిరసిస్తూ పార్లమెంట్ మెట్లపై జరిగిన ఆందోళనలో వేం నరేందర్ రెడ్డి తమతో కలిసి పాల్గొనడం శుభసూచికమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ప్రజా సమస్యలపై అవగాహనతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నాయకుడిగా ఆయన సేవలు దేశ స్థాయిలో తెలంగాణ స్వరాన్ని మరింత బలంగా వినిపిస్తాయని పేర్కొన్నారు.

దేశ ప్రజలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కులను బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని ఎంపీ విమర్శించారు. “కాక్రోచ్ జనతా పార్టీ” అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగానే ప్రశ్నించే యువత అకౌంట్లను బ్లాక్ చేయించడం బీజేపీ అసహన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్భయంగా ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకెట్‌లా ముందుకు దూసుకెళ్తుంటే, ఆ రాకెట్‌కు నిప్పురవ్వలా వేం నరేందర్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. చిరునవ్వుతో, సహనంతో, అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకుడు వేం నరేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో వేం నరేందర్ రెడ్డి కృషి ఎంతో ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొండాసురేఖ, ధనసరి అనసూయ సీతక్క, శాసనసభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, జాటోత్ రామ్ చందర్ నాయక్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Avatar photo

By Editor

Digital journalist and media professional delivering accurate breaking news, impactful storytelling, and engaging content across modern platforms.